వడియాలను చూస్తే చాలు...
ఎందుకిలా రేడియంలా మెరుస్తాయి కళ్లు?
వడియాన్ని చూస్తే ఎందుకిలా నాలుకపై సుడి తిరుగుతాయి నీళ్లు?
వడియం రుచిని వర్ణించడం అంటే...
కడియాన్ని అద్దంలో చూడటమే!
ఇక... అదేం చిత్రమోగానీ... మిరప కారంలో ఓ చమత్కారం ఉంది.
మిరపకాయల్ని మజ్జిగలో ఊరేశాక చల్లలోని పుల్లదనం కాస్తా కారాన్ని జోకొడుతుంది.
మిరపలోని చిరు ‘మంట’ కాస్తా కడుపులోకి స్థానచలనంపై వెళ్లి
అక్కడ ‘జఠరాగ్ని’ హోదా సాధిస్తుంది.
ఇదోరకం ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్.
అయినా వడ్డన మాని వర్ణనలేలా?
తినడం మానేసి ఈ తిప్పలేలా?
కంచం అంచున వడియాలు వడ్డించుకోండి.
చల్ల మిరపకాయల్ని ఫుల్లుగా కొరికి నమిలేయండి.
వడియంతో దోస్తీ చేయండి... విస్తరితో కుస్తీ పట్టండి...
పెసర వడియాలు
పెసరపప్పు - పావు కేజీ
పచ్చి మిర్చి - 15
జీలకర్ర - టీ స్పూను
ఉప్పు - తగినంత
ఇంగువ - టీస్పూను
తయారీ:
పెసరపప్పును శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి
నీళ్లు వడకట్టి... పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
ఎండలో... ప్లాస్టిక్ కవర్ మీద స్పూనుతో వడియాలు పెట్టి ఎండనివ్వాలి
రెండు రోజులతరువాత కవర్ నుండి విడదీసి పళ్లెంలో వేసి ఎండబెట్టి, గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
బంగాళ దుంప అప్పడాలు
బంగాళదుంపలు - కిలో; ఉప్పు - తగినంత; కారం - 2 టీ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ
బంగాళదుంపలను శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
చల్లారాక బంగాళదుంపల తొక్క తీసి సన్నగా తురమాలి
ఉప్పు, కారం జత చేసి మెత్తగా కలపాలి
చేతికి నూనె రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద నూనె రాయాలి
ఉండల అంచులకు కూడా కొద్దిగా నూనె రాసి ప్లాస్టిక్ కవర్ మీద ఉంచి పైన రాసి, మళ్లీ ప్లాస్టిక్ కవర్ ఉంచి, ఆ పైన జాగ్రత్తగా ఒత్తాలి
ముందుగా పైన ఉన్న పొర తీసి ఒత్తి ఉంచుకున్న అప్పడాన్ని జాగ్రత్తగా చేతితో తీసి ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ మీద వేసి ఎండలో ఆరబెట్టాలి. నాలుగైదు రోజులు ఎండాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
టొమాటో సగ్గుబియ్యం వడియాలు
సగ్గుబియ్యం - అర కేజీ; టొమాటోలు - 200 గ్రా;
నీళ్లు - 6 కప్పులు; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారీ
టొమాటోలను శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో సుమారు పావుగంటసేపు ఉడికించాలి చల్లారాక పైన తొక్కు తీసి ప్యూరీలా చేసి పక్కన ఉంచాలి
సగ్గుబియ్యాన్ని సుమారు పావుగంటసేపు నానబెట్టి నీళ్లు ఒంపేయాలి
ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఆరు కప్పుల నీళ్లు పోసి కుకర్లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి
సగ్గుబియ్యం చల్లారాక, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద, ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని స్పూన్తో తీసుకుని వడియాలుగా పెట్టాలి
కొద్దిగా ఎండాక ప్లాస్టిక్ కవర్ నుంచి వేరు చేసి పళ్లెంలో నాలుగైదు రోజులు ఎండబెట్టి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
గుమ్మడివడియాలు
బూడిద గుమ్మడికాయ - ఒకటి
పచ్చి మిర్చి - 100 గ్రా.
పొట్టు మినప్పప్పు - పావు కేజీ
పసుపు - టీ స్పూను
ఉప్పు - తగినంత
జీలకర్ర - 50 గ్రా.
ఇంగువ - టీ స్పూను
నువ్వులపొడి - 2 టీ స్పూన్లు
తయారీ:
బూడిద గుమ్మడికాయ ముక్కలు సన్నగా తరిగి పొడి వస్త్రంలో మూట గట్టి దాని మీద బరువు ఉంచి ఒక రోజు రాత్రి వదిలేయాలి
పొట్టుమినప్పప్పు నానబెట్టి, మరుసటి రోజు పప్పును శుభ్రంగా కడిగి, పొట్టు తీసి, గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
పచ్చి మిర్చి, ఉప్పు, జీలకర్ర జత చేయాలి
ఒక పెద్ద పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, రుబ్బి ఉంచుకున్న పిండి వేసి కలపాలి
ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెట్టాలి
రెండుమూడు రోజులతరువాత ప్లాస్టిక్ కవర్ మీద నుంచి విడదీసి పళ్లెంలో వేసి ఎండబెట్టాలి.
రాగి పిండి వడియాలు
రాగి పిండి - కప్పు; నీళ్లు - 5 కప్పులు; కారం - టీ స్పూను; ఉప్పు - తగినంత; ఇంగువ - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
తయారీ:
రెండు కప్పుల నీళ్లలో రాగి పిండి వేసి కలిపి పక్కన ఉంచాలి
మిగిలిన నీటిని స్టౌ మీద ఉంచి మరిగించాలి
ఉప్పు, కారం, జీలకర్ర జత చేయాలి
చల్లటి నీటిలో కలిపి ఉంచుకున్న రాగి పిండిని మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి
బాగా ఉడికాక ఇంగువ వేసి కలిపి దించేయాలి
చల్లారాక ప్టాస్లిక్ కాగితం మీద స్పూన్తో వడియాలు పెట్టి ఎండనివ్వాలి
కొద్దిగా ఎండిన తర్వాత వాటిని విడదీసి పళ్లెంలో ఉంచి రెండు రోజులు ఎండనిచ్చి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఊరిన మిరపకాయలు
పచ్చి మిర్చి - కేజీ (బజ్జీమిర్చి వాడాలి)
పుల్ల పెరుగు - 2 లీటర్లు
ఉప్పు - తగినంత
పసుపు - కొద్దిగా
ఇంగువ - టీ స్పూను
తయారీ
పచ్చి మిర్చిని నిలువుగా ఒక వైపు కట్ చేయాలి
పుల్ల పెరుగులో ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలపాలి
పచ్చిమిర్చిని అందులో వేసి ఒక రోజంతా ఉంచాలి
మరుసటి రోజు పెరుగులో నుంచి మిర్చిని బయటకు తీసి ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఉంచాలి
పెరుగును కూడా ఎండబెట్టాలి
సాయంత్రం మిర్చిని పెరుగులో నానబెట్టాలి
మరుసటి రోజు మళ్లీ ముందులాగే ఎండబెట్టాలి
ఇలా సుమారు ఐదు రోజులయ్యాక ఇంక పెరుగులో వేయకుండా కేవలం మిర్చి మాత్రమే ఎండబెట్టాలి
పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వచేసుకోవాలి
వీటిని వేయించుకుంటే, మామిడికాయ పప్పులోకి రుచిగా ఉంటాయి.