Feast - విందు బోనం
Non - Veg Specials for the Guest
గడప గడపకూ ఆమె పాదం తగిలి...
పసుపు కుంకుమలకు ప్రాణాలు లేచి వస్తాయి.
ఇల్లు అలక్కముందే పండగౌతుంది.
బిడ్డ అడక్కముందే బోనం దిగుతుంది.
అక్కా... చక్రపొంగలి, అక్కా... చెక్క వడలు!
మటనుందీ, నాటుకోడుందీ, పాయా సూపుందీ...
ఏం తింటవే తల్లీ... నాయమ్మా!
అమ్మాయి ఇంటికొస్తే... అమ్మవారే వచ్చినట్లు!
అమ్మవారే ఇంటికొస్తే...
ఊరంతటికీ పండగొచ్చినట్లు!
ఈ పండక్కి మనమూ బోనం ఎత్తుదాం రండి.
నైవేద్యం పెట్టి, నలుగురినీ పిలుద్దాం పదండి.
కీమా బాల్స్
మటన్ కీమా - 250 గ్రా; కొత్తిమీర - అర కప్పు
అల్లం - చిన్నముక్క; వెల్లుల్లి రేకలు - 5
పచ్చిమిర్చి - 3; కారం - టీ స్పూను
ధనియాలపొడి - టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారి:
కీమాను శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయే వరకు ఆరనివ్వాలి.
మిక్సీలో సగం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా నీరు వేసి మెత్తగా పేస్ట్లా చేయాలి.
కారం, ఉప్పు, కీమా, ధనియాలపొడి, వేసి మెత్తగా చేయాలి.
మిశ్రమాన్ని బయటకు తీసి చిన్నచిన్న బాల్స్లా చేయాలి.
ఒక పాత్రలో నీరు పోసి ఈ బాల్స్ని అందులో వేసి బాగా ఉడికించాలి. (ఇవి ఉడకడానికి సుమారు 10 నిముషాల పైనే పడుతుంది)
నీటిని వడ పోసి బాల్స్ను పేపర్ టవల్ మీద ఉంచాలి.
బాణలిలో నూనె పోసి కాగాక ఈ బాల్స్ని నూనెలో వేసి బాగా వేయించి తీసేయాలి.
పాయా సూప్
మేక కాళ్లు - 4 (నాలుగేసి ముక్కలుగా కట్ చేయాలి); టొమాటో ప్యూరీ - కప్పు; ఉల్లితరుగు - రెండు కప్పులు; గరంమసాలా - టీ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; ధనియాలపొడి - టేబుల్ స్పూను; పచ్చిమిర్చి - 5; కొబ్బరితురుము - 2 టేబుల్ స్పూన్లు; కారం - 2 టీ స్పూన్లు; మిరియాల పొడి - టీ స్పూను (పొడి మరీ మెత్తగా ఉండకూడదు); పసుపు - కొద్దిగా; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్ స్పూన్లు; లవంగాలు - 6; ఏలకులు - 4; దాల్చినచెక్క - చిన్న ముక్క; బిరియానీ ఆకు - 1; ఉప్పు - తగినంత
తయారి:
ఒక కప్పు ఉల్లితరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరితురుము వేసి మెత్తగా పేస్ట్ చేసి, పక్కన ఉంచాలి.
లెగ్ పీసులను శుభ్రంగా కడగాలి. దీనిలో లీటరు నీరు, పసుపు, ఉప్పు జత చేసి కుకర్లో ఉంచి ఆరు విజిల్స్ రానివ్వాలి.
బాణలిలో నూనె కాగాక, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిరియానీ ఆకు వేసి బాగా కలిపి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేయాలి.
ఉల్లితరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.
ధనియాలపొడి, కారం, గరంమసాలా, మిరియాలపొడి వేసి ఒక నిముషం పాటు వేయించాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని, కుకర్లో ఉడికించి ఉంచుకున్న లెగ్ పీస్లలో వేసి, తరువాత టొమాటో ప్యూరీ జత చేసి సుమారు రెండు నిముషాలు సన్నని మంట మీద ఉడికించాలి.
తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మసాలా, అర లీటరు నీరు జతచేసి, మంట పెద్దది చేసి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
నాటుకోడి కూర
మసాలా పేస్ట్ కోసంధనియాలు - టేబుల్ స్పూన్
(దోరగా వేయించినవి)
మిరియాలు - కొద్దిగా
కొబ్బరితురుము - అర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రేకలు - 7
అల్లంతరుగు - కొద్దిగా
కూర కోసం: చికెన్ ముక్కలు - 8
నూనె - 3 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - 4; ఉల్లితరుగు - పావు కప్పు
కారం - టీ స్పూను; నీరు - ఒకటిన్నర కప్పులు
గరంమసాలా - టీ స్పూను; ఉప్పు - తగినంత
కొత్తిమీర - గార్నిషింగ్కి సరిపడా
మసాలాపేస్ట్ తయారి:
మిరియాలు, కొబ్బరితురుము, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, కొద్దిగా నీరు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
కూర తయారి:
ప్రెజర్పాన్లో కొద్దిగా నూనె వేసి కాగాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి. కారం, పసుపు జత చేయాలి. కొద్దిగా నీరు పోసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
ఉడికించిన చికెన్ ముక్కలు, తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ జత చేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి.
కొద్దిగా నీరు, గరంమసాలా, ఉప్పు వేసి, మంట తగ్గించి రెండుమూడు నిముషాలు ఉంచి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
మటన్ బిరియానీ
బాస్మతి బియ్యం - అర కిలో; బిరియానీ ఆకు, నల్ల ఏలకులు, ఆకుపచ్చ ఏలకులు - 2 చొప్పున; నువ్వులు - 2 టీ స్పూన్లు; మిరియాలు, లవంగాలు - 6 చొప్పున; దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ - కొద్దికొద్దిగా; మెంతులు - టీ స్పూను; ఉప్పు - 3 టీ స్పూన్లు; మటన్ - కేజీ; గరంమసాలా - టేబుల్ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; బొప్పాయి గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు; పుల్ల పెరుగు - 4 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - టీ స్పూను; కారం, ఉప్పు - తగినంత; ఉల్లితరుగు, టొమాటో ప్యూరీ, చల్లటి పాలు - పావు కప్పు చొప్పున; నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - కొద్దిగా; నూనె - కొద్దిగా; రోజ్ వాటర్ - రెండు చుక్కలు; పచ్చిమిర్చి - 4; ధనియాల పొడి, జీలకర్ర పొడి- టీ స్పూన్ చొప్పున; పుదీనా, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
ఒక పాత్రలో మటన్, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, బొప్పాయి గుజ్జు, కారం, నిమ్మరసం, గరంమసాలా వేసి మూడు గంటలపాటు మారినేట్చేయాలి.
బాణలిలో నూనె వేసి వేడయ్యాక, సగం ఉల్లితరుగు వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
పాన్లో నెయ్యి వేసి కరిగాక మిగిలిన ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరోమారు కలపాలి.
మ్యారినేట్ చేసిన మటన్ జత చేసి బాగా మగ్గిన తర్వాత, టొమాటో ప్యూరీ వేసి కలపాలి.
ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి కలపాలి.
మూడు కప్పుల నీరు పోసి మూత ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉంచాలి. (అవసరానికి తగ్గట్టు నీరు ఎక్కువ వేసుకుని, మాడకుండా చూసుకోవాలి)
పాన్ మూత తీసి ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర వేసి పది నిముషాలు ఉడికించాలి.
అన్నం తయారి:
బియ్యాన్ని 20 నిముషాలు నానబెట్టి కడిగి, నీరు ఒంపేయాలి.
ఒక వస్త్రంలో ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ ముక్క, మిరియాలు వేసి మూట కట్టాలి.
750 మి.లీ. నీటిని మరిగించి, అందులో బియ్యం, బిరియానీ ఆకు, ఉప్పు, మూట కట్టిన వస్త్రం ఉంచి అన్నం మూడు వంతులు ఉడికాక, నీరు ఒంపేసి, మూట తీసేయాలి.
ఒక కప్పులో పాలు, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక పాత్రకు కిందకు దింపి, పాత్ర అంతా అంటేలా పాత్రను కదపాలి.
ఉడికించిన బియ్యం, మటన్ ముక్కలు, కుంకుమపువ్వు పాలు, వేయించిన ఉల్లితరుగు, నెయ్యి వరుసగా ఒకదాని మీద ఒకటిగా లేయర్లుగా పరచాలి. మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా అమర్చాలి.
పైన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి గట్టి మూత ఉంచి స్టౌ మీద ఉంచాలి. 20 నిముషాల తర్వాత దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.
సర్వపిండి
బియ్యప్పిండి - 3 కప్పులు; నువ్వుపప్పు, పల్లీలు, ఉల్లికాడల తరుగు - పావు కప్పు చొప్పున; ఉల్లితరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టేబుల్స్పూన్లు; కరివేపాకు తరుగు - టేబుల్ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - కొద్దిగా; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; పుట్నాలపప్పు, నానబెట్టిన శనగపప్పు, క్యారట్ తురుము - పావు కప్పు చొప్పున; ధనియాలు, అల్లం రసం - టీ స్పూను చొప్పున.
తయారి:
నువ్వుపప్పు, పల్లీలను విడివిడిగా సుమారు గంటసేపు నానబెట్టాలి. ఉల్లితరుగును మిక్సీ పట్టాలి (మరీ మెత్తగా అవ్వకూడదు) ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, నానబెట్టి వడకట్టిన నువ్వుపప్పు, పల్లీలు, ఉప్పు, పచ్చిమిర్చితరుగు, కారం, వెల్లుల్లితరుగు, ఉల్లికాడల తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లితరుగు, పుట్నాలపప్పు, నానబెట్టిన శనగపప్పు, క్యారట్ తురుము వేసి బాగా కలపాలి.
కొద్దిగా నీరు జత చేసి పిండి గట్టిగా ఉండేలా కలపాలి.
పిండిని చిన్న ఉండలా చేతిలోకి తీసుకుని, నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ మీద చేతి వేళ్లతో పల్చగా అద్దాలి.
ఇలా మొత్తం పిండినంతా తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్నవాటిని ఒకటొకటిగా వేస్తూ బాగా వేగిన తరువాత తీసేయాలి.

